కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వృత్తి కళాకారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వందల ఏండ్ల నుంచి సామాజిక చైతన్యం, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించే నాటకరంగం తన వైభవాన్ని చాటుకునేలా.. వినూత్న ప్రయోగం వైపు పయనిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వేదికలపై ప్రదర్శనలు చేయడం కన్నా.. ఆన్లైన్ ద్వారా నాటకాలను ప్రదర్శించడం శ్రేయస్కరమన్న ఉద్దేశంతో పలు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా అభినయ థియేటర్స్ ట్రస్ట్, వెంకటేశ్వర సురభి థియేటర్స్ సంస్థల ఆధ్వర్యంలో ఆన్లైన్లో ప్రదర్శిస్తున్న నాటకాలను ఎందరో అభిమానులు ఆదరిస్తున్నారు.