సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్యార్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల తర్వాత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్ల అనుమతి మేరకు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులతో పాటు జనరల్, వికలాంగుల పాసులను కూడా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారందరూ నగరంలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల వద్ద బస్పాస్కు చెందిన ఐడీ, బస్సు పాసులు పొందే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 8.15 వరకు అన్ని కేంద్రాలలో పాసులు జారీ చేయనున్నారు. బస్పాసు కేంద్రాలు, ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర పూర్తి వివరాల కోసం https://online.tsrtcpass.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.