సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): తనను పెండ్లి చేసుకోవాలని.. లేదంటే చనిపోతానని డెడ్లైన్ పెట్టాడు. తెగిన చేతి ఫొటోను పంపించి.. ఆత్మహత్యకు పాల్పడినట్లు భయపెట్టాడు. ఇలా ఓ బీటెక్ విద్యార్థినిని వేధిస్తున్న వన్సైడ్ లవర్ను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..శంకర్పల్లి మండలం పిల్లిగుండ్ల గ్రామంలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న యువతిని చూసిన అదే ప్రాంతానికి చెందిన జంగంపేట ప్రసాద్రెడ్డి ఆమె మెప్పు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో 2019లో కళాశాలలో ఓ తోటి విద్యార్థి సదరు యువతిని ప్రేమించమని వేధించాడు. విషయం తెలుసుకుని ప్రసాద్రెడ్డి అతడిని మందలించాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని, ప్రసాద్రెడ్డి స్నేహితులుగా మారారు. దీనిని అవకాశంగా తీసుకుని ప్రసాద్రెడ్డి ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకోవాలని ఆ యువతికి ప్రతిపాదించగా, ఆమె తిరస్కరించింది. దీంతో కోపాన్ని పెంచుకున్న ప్రసాద్రెడ్డి తనను ప్రేమించాలని, వివాహం చేసుకోవాలని లేదంటే బాధితురాలి పేరు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తూ.. ఆగస్టు 10వ తేదీని డెడ్లైన్గా పెట్టాడు. ఇంటర్ నెట్ నుంచి రక్తపు మరకలతో ఉన్న తెగిన చేతి ఫొటోను పంపించి.. తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు భయపెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు ప్రసాద్రెడ్డిని బుధవారం అరెస్ట్ చేశారు.