సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో ఈనెల 23 నుంచి పట్టాలెక్కనున్న మల్టీ మోడల్ ట్రైన్ సర్వీసు (ఎంఎంటీఎస్) నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 కంటే ముందుగా జారీ చేసిన సీజనల్ పాత టిక్కెట్లు తిరిగి చెల్లుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే మార్చి 23, 2020 నాటికి సీజనల్ టిక్కెట్లు తీసుకున్న వారు.. ఆ రోజు నాటికి ఎన్ని రోజులు నష్టపోయారో.. తిరిగి అన్ని రోజులు కలిసి వచ్చే విధంగా పాత సీజనల్ టిక్కెట్ పాసులు చెల్లుతాయన్నారు. వాటిని ఎంఎంటీఎస్ టిక్కెట్ కేంద్రాల వద్ద సంప్రదించి రెన్యూవల్ చేసుకోవాలన్నారు. గత ఏడాదిలో సీజనల్ టిక్కెట్ పొందిన నష్టపోయిన రోజులు తిరిగి సీజనల్ టిక్కెట్లు పొందవచ్చన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత వరకు ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణం చేసే వారు క్యాష్లెస్ టిక్కెట్ పొందే విధంగా ఎస్సీఆర్ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఎంఎంటీఎస్ టిక్కెట్ కేంద్రాల వల్ల ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ (ఏటివీఎం)ను వినియోగించుకున్న వారికి 3 శాతం, ఆన్రిజర్వ్డ్ సిస్టం (యూటీఎస్) మొబైల్ యాప్లోని ఆర్-వాలెట్ను టిక్కెట్ కోసం వినియోగించుకున్న వారికి 5 శాతం చొప్పున బోనస్ ప్రకటిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.