కంటోన్మెంట్, ఆగస్టు 23 : బాలంరాయి నుంచి న్యూ బోయిన్పల్లి చౌరస్తా వరకు, ఆ మార్గమధ్యలో ముస్లిం శ్మశానవాటిక వద్దనున్న ప్రమాదకరమైన మూలమలుపు ప్రాంతాన్ని సోమవారం హెచ్ఆర్డీసీఎల్ అధికారులు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు బాలంరాయి నుంచి న్యూ బోయిన్పల్లి చౌరస్తావరకు, ప్రమాదకరమైన మూలమలుపు వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై అధ్యయనం చేశారు.
మూలమలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడం, వీధి దీపాలు వెలగకపోతుండడం, సూచికలను ఏర్పాటు చేయకపోవడం, రోడ్డుకు ఎడమవైపునున్న వృక్షాల కొమ్మలు పెరిగి మూలమలుపు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ రోడ్డు పొడువునా ఏర్పడిన గుంతల మరమ్మతులను చేపట్టకపోవడం, వీధి దీపాలు సరిగా వెలగకపోతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. కార్యక్రమంలో బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్, తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్, హెచ్ఆర్డీసీఎల్ ఈఈ విజయకుమార్, డీఈ సత్యనారాయణ, ఏఈఈ మురళి తదితరులు పాల్గొన్నారు.