కొండాపూర్, మే 14: కిడ్నీ మార్పిడికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి గుండె రక్తనాళాల పంపింగ్లో తలెత్తిన సమస్యను ఎలాంటి సర్జరీలు లేకుండా చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు మెడికవర్ వైద్యులు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ.శరత్రెడ్డి శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి(49) కిడ్నీ ఫెయిల్యూర్తో దవాఖానకు వచ్చాడు. పరీక్షలు నిర్వహించగా అతడి హార్ట్ పంపింగ్ ఫెయిలై గుండెకు రక్త సరఫరా చేసే రెండు నాళాల్లో బ్లాకేజీలతో ట్రిపుల్ వెజిల్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో పాటు పేషెంట్ 2002లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగా 2018లో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తలెత్తింది. కాగా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కష్టమవుతుందని నెఫ్రాలజిస్ట్ కమల్ కిరణ్ల పర్యవేక్షణలో ‘ఇంపెల్లా’ నాన్ – సర్జికల్ టెక్నాలజీతో పెర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో హార్ట్ బ్లడ్ వెజిల్ బ్యాకేజీలను తొలగించారు. ఇంపెల్లా అనేది యూఎస్ ఎప్డీఏ ధ్రువీకరించిన నాన్ – సర్జికల్ హార్ట్ పంప్ టెక్నాలజీ అని, తీవ్రమైన గుండె సమస్యలతో పాటు ఇతర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలున్న సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించినట్లు తెలిపారు. రోగి సైతం తక్కువ సమయంలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.