హైదరాబాద్: ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ కరోనాతో మృతిచెందారు. వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్లోని విరించి హాస్పిటల్లో సీనియర్ పల్మనాలజిస్ట్గా ఈశ్వర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. కొంతకాలంపాటు ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో ప్రొఫెసర్గా సేవలందించారు.
కాగా, మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీలో వైద్యుడు పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ సత్యేంద్ర మిశ్రా కరోనా బారినపడ్డారు. చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్సులో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఎక్మో, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఏడాదిపాటు కరోనా రోగులకు చికిత్స అందించిన సత్యేంద్ర మిశ్రాకు రెండు వారాల క్రితం వైరస్ సోకింది. దీంతో ఆయన ఊపిరితిత్తులు 80 శాతం చెడిపోయాయి. ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకు వ్యాపించింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్కు తరలించారు.
రాష్ట్రంలో కొత్తగా 5567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. ఇందులో 49,781 యాక్టివ్ కేసులు ఉండగా, 3,21,788 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1899 మంది మరణించారు. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 989 కేసులు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..