హైదరాబాద్ : వినడానికి కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా ఈ న్యూస్. కానీ ఇప్పుడు ఇదే జరగబోతుందని తెలుస్తుంది. పవన్ మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించని వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. రూ. 85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది. దిల్ రాజుకు ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చాయి. థియెట్రికల్ రన్ తో పాటు డిజిటల్, శాటిలైట్ రూపంలో నిర్మాత దిల్ రాజుకు దాదాపు రూ. 40 కోట్లకు పైగా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
వకీల్ సాబ్ తర్వాత పవన్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు ఈ నిర్మాత. పింక్ సినిమాను ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి చేసాడు వేణు శ్రీరామ్. అయితే ఇప్పుడు ఈయనే పవన్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇది వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతుంది. తన సొంత కథతో ఈ సినిమాకు కొనసాగింపు చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీల సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరిగేలా వేణు శ్రీరామ్ కథ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ రాజకీయాలకు పనికొచ్చేలా కొన్ని డైలాగ్స్ రాశాడు. దాంతో పవన్ కు కూడా వేణు పనితనం బాగా నచ్చేసింది. అందుకే ఈయనకు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. సీక్వెల్ అంతా ఎక్కువగా రైతుల సమస్యలు ఉండేలా చూసుకుంటున్నాడు ఈ దర్శకుడు. దాంతో పాటు గ్రామాల అభివృద్ధి అనే అంశాన్ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే పవన్ ఫ్యాన్స్ కు పండగే.