ఖైరతాబాద్, అక్టోబర్ 18 : కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న రోగులకు ఐసీయూ, వెంటిలేటర్లపై ప్రత్యేక చికిత్స అందించడం ఎంతో అవసరం. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఏడాదిన్నర కాలంగా కొవిడ్ రోగుల కోసం సర్కార్ దవాఖానల్లో ఐసీయూ బెడ్లతో పాటు వెంటిలేటర్లతో కూడిన బెడ్ల సంఖ్యను పెంచింది. కాగా, రాబోయే ముప్పును ముందే ఎదుర్కొనేందుకు పీఎం కేర్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిమ్స్ దవాఖానలో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వాటిని మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్లు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు.