రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రజల ప్రాణాలను కాపాడటమే కర్తవ్యంగా భావించిన సీఎం కేసీఆర్ రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచే అమల్లోకి తీసుకురావాలని సూచించడంతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని ముఖ్య కూడళ్లవద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కట్టడికి కలిసి రావాలని.. సహకరిస్తేనే కట్టడి సాధ్యమవుతుందనేది అర్ధం చేసుకొని ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు వీడి.. నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూనుంచి మినహాయింపు ఉన్నవారు తప్పనిసరిగా ఐడీకార్డు చూపించాలని కోరారు.