కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 26 : ‘నెక్సస్ మాల్స్’ జాబితాలో ఫోరం సుజనా మాల్స్ సంపూర్ణంగా చేరిందని నెక్సస్ మాల్స్ ఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెయేన్ నాయక్, క్లస్టర్ డైరెక్టర్ తన్వీర్ షేక్ తెలిపారు. కేపీహెచ్బీ కాలనీలోని నెక్సస్ మాల్స్ (ఫోరం సుజనా మాల్స్)లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నెక్సస్ మాల్స్ కొనుగోలు చేసిన ఫోరం సుజనా మాల్స్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతోపాటు సుందరీకరణ, ఆధునీకరణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. గత ఏడేండ్లుగా కొనసాగుతున్న ఫోరం సుజనా మాల్ 8 లక్షల చదరపు అడుగులు.. 138 విశాలమైన షాపులు, 4వేల మంది ఉద్యోగులు, సిబ్బందితో సేవలందిస్తూ నగరంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరణతో ముందుకు సాగుతుందన్నారు. కరోనా తర్వాత వందశాతం వ్యాపారాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగిందని.. ఈ మాల్లో నగరంలో ఎక్కడా లేని 15కు పైగా ప్రత్యేక బ్రాండ్స్ ఉన్నాయని తెలిపారు. లాక్డౌన్లోనూ 15 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. నెక్సస్ మాల్స్లో దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లో భాగంగా రూ.10వేలు షాపింగ్ చేసిన వినియోగదారులకు బహుమతిని ఇచ్చామన్నారు. కరోనా నియ మ నిబంధనలు పాటిస్తూ వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా విభిన్నమైన సేవలు అందించడంలో ఫోరం సుజనా మాల్ ముందుంటుందని తెలిపారు.