సిటీ బ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బాలల మనస్తత్వం, వారి స్వభావం ప్రతిబింబించే నాటికలను బాల సాహిత్యం రూపంలో పిల్లలకు అందించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా నాటక రచన పోటీలను నిర్వహిస్తున్నది. దేశభక్తి, హాస్యం, నైతిక విలువలు, సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ వైభవం, సహానుభూతి, భూతదయ, స్త్రీ సాధికారత, కుటుంబ విలువలు, వైజ్ఞానిక అంశాలు, ఆరోగ్యం ఇతివృత్తాల ఆధారంగా లఘు నాటికలను ఎంపిక చేసి వాటిని ముద్రించనున్నది.
సరళమైన భాషలో విద్యార్థుల మనస్తత్వానికి తగినట్లు ఆకర్షణీయంగా, అందరినీ ప్రభావితం చేసే రచనలను ఈ నెల 10 లోపు పంపాలని ఎస్సీఈఆర్టీ తెలుగు విభాగం సూచించింది. ప్రాథమిక పాఠశాల స్థాయి (1-5వ తరగతి) విద్యార్థుల కోసం 3 పేజీలు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి (6-8 తరగతి) విద్యార్థుల కోసం 5 పేజీలు, ఉన్నత పాఠశాల (8-10వ తరగతి) విద్యార్థుల కోసం 7 పేజీల్లో, పాత్రలు వీలైనంత తక్కువ సంఖ్యలో ఉండాలని, రచనల్లో కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలకు తావులేదని.. వివాదాస్పద అంశాలతో పాటు ఏ ఒక్కరినీ కించపరిచేలా ఉండరాదని కోరింది. రచయితలు తమ లఘు నాటిక ప్రతులను balasahityamscert. telangana<\@>gmail.com మెయిల్కు పంపాలని, ఉత్తమ నాటికలకు బహుమతి ప్రదానం, ప్రచురణకు ఎంపికైన రచనలకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఎస్సీఈఆర్టీ తెలుగు విభాగం కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్ 9618676215, సభ్యులు పల్లెర్ల రామ్మోహన్రావు 9177840278, వొజ్జల శరత్బాబు, గాజుల రవీందర్, కొండు జనార్దన్, అవుసుల భాను ప్రకాశ్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
కళలపై చిన్నారుల్లో ఆసక్తి పెంచేందుకు అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక కథాంశాలతో కూడిన నాటికలు (30 నిమిషాలు), ఏకపాత్రాభినయాన్ని (10 నిమిషాలు) వీడియో తీసి abhinayasrinivas7<\ @>gmail.com ఈ నెల 25 లోపు పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు 9391111622 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.