ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 5: రాష్ట్రంలో నూతన టెక్నాలజీని ఉపయోగించి, విద్యావ్యవస్థలో మార్పును తీసుకువస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆవశ్యకత ఉన్న సబ్జెక్టులను విద్యార్థులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ విభాగం, ఇండియన్ జాగ్రఫికల్ సొసైటీ సంయుక్తాధ్వర్యంలో ‘ఎర్త్ సైన్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును వర్చువల్లో ప్రారంభించిన నవీన్ మిట్టల్ మాట్లాడుతూ కరోనా విజృంభణ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతోపాటు పర్యావరణం, వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సదస్సులో ఇంగ్లండ్, శ్రీలంక, ఇజ్రాయిల్ తదితర దేశాల నుంచి పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జితేందర్నాయక్, డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, విభాగం హెడ్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఐవీ మురళీకృష్ణ, ప్రొఫెసర్లు అనురాధ బెనర్జీ, ఆల్ఫ్రెడ్ చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.