హయత్ నగర్, సెప్టెంబర్ 03 : హనుమాన్ ఆలయంలో ఓ గుర్తు తెలియని దుండగుడిచే నవగ్రహాలు ధ్వంసం చేసిన సంఘటన హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద విజయవాడ జాతీయ రహదారి పక్కన గల హనుమాన్ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుడు ఆలయంలోకి ప్రవేశించి నవగ్రహాలను ధ్వంసం చేశారు.
ఆలయం పై నున్న గోపురాన్ని కూడా తొలగించాడు. అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించారు. పోలీసు స్టేషన్లో సదరు నిందితుడు మానసిక స్థితి బాగా లేనట్లుగా ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి హయత్ నగర్ సీఐ సురేందర్ గౌడ్, డీఐ నిరంజన్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.