సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వర్షా కాలం రావడంతో మహా నగరంలో ముంపు, నాలాలు, వరదలు వచ్చే ప్రాంతాలపై దృష్టి సారిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. వర్షాలు పడుతున్న వేళ జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం నాలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒకవైపు నాలాల పూడికతీత పనులు, మరోవైపు విస్తరణ పనులతో ప్రజలకు ఈ ఏడాది ముంపు బాధలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నాలాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతం లాంటి చర్యలు చేపడుతున్నారు.
వీటితో పాటు నాలాలలో పేరుకుపోయిన వ్యర్థాలు, పూడికతీత పనులకు ఈ ఏడాది రూ.45 కోట్లను కేటాయించింది. జనవరి నెలలో పనులకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం 92 శాతం మేర పనులను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి 19వ తేదీ వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాలాల పనులను వేగవంతం చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలోనే నాలాలలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా సెల్ఫోన్ నం: 98480 21665తో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు.
జంట నగరాలలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా సెల్ ఫోన్ నెం: 98480 21665తో వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నేరుగా ఫిర్యాదు చేయదలచిన వారు సెల్ఫోన్ నెం: 9848282309కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలలో పూడిక తొలగింపు పనులకు ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించిందని తెలిపారు. పూడిక పనుల పురోగతి, పనులను వేగవంతం కోసం ప్రజా ప్రతినిధులంతా నేటి (సోమవారం) నుంచి 19వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో సందర్శించాలని మంత్రి సూచించారు. బేగంపేట నాలాలను సోమవారం ఉదయం 10 గంటలకు సందర్శిస్తానని తలసాని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కావొద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లో గ్రేటర్ నాలాల పూడిక తొలగింపు పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వివరించారు. నాలాల పూడిక తొలగింపునకు సంబంధించిన ఫిర్యాదులను ఫొటోలు, నాలా ప్రాంతం, సంబంధిత వ్యక్తి సమాచారం వాట్సాప్ గ్రూపునకు పంపించాలని మంత్రి తలసాని కోరారు.