ఎల్బీనగర్, మార్చి 20: రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఆగిపోయిన నాగోలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా నాగోల్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. లాక్డౌన్ సమయంలోనే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎస్ఆర్డీపీ అధికారుల ప్రత్యేక చొరవతో నాగోలు గ్రామం వైపు రోడ్డు విస్తరణ చేయించారు. ఈ క్రమంలో కేబుల్, పైపులైన్ పనుల నేపథ్యంతో తాత్కాలికంగా నాగోలు ఫ్లై ఓవర్ పనులు ఆపేశారు. అయితే రోడ్డు విస్తరణ, వాటర్, డ్రైనేజీ, వరదనీటి కాలువతో పాటు విద్యుత్ స్తంభాలను రోడ్డు పక్కకు జరిపే పనులు సైతం పూర్తయ్యాయి. తాజాగా నాగోలు బ్రిడ్జి నుంచి నాగోలు చౌరస్తా మధ్యలో ఓ లింక్ను పూర్తి చేస్తే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయిలో లైన్ క్లియర్ అవుతుంది. నాగోలు జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు రెండు వైపులా ప్రయాణించేలా ఫ్లై ఓవర్లను నిర్మాణం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు.. ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి నుంచి ఎల్బీనగర్ వైపునకు, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లేందుకు నాగోలు చౌరస్తాలో రూ.64.42 కోట్ల వ్యయంతో 24 మీటర్ల వెడల్పు, 1040 మీటర్ల పొడవుతో రెండువైపులా ప్రయాణించేలా మూడు లేన్ల ఫ్లై ఓవర్లను నిర్మాణం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాగోలు చౌరస్తా నుంచి ఉప్పల్ వైపు 180 మీటర్ల పొడవు, ఎల్బీనగర్ వైపు 170 మీటర్లు పొడవుతో నిర్మిస్తున్నారు. నాగోలు చౌరస్తాలో ఇన్నర్ రింగ్రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కోసం 23 పిల్లర్లు పూర్తి చేశారు. వీటిపై స్టేజింగ్ వర్కు మెటీరియల్ పనులను ప్రారంభించారు. ఈ మేరకు పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని ప్రాజెక్ట్ డీఈ కార్తిక్ తెలిపారు. ప్రీకాస్టింగ్ పనులే కావడంతో కాస్టింగ్ జోన్లో రుపొందించిన వాటిని తీసుకొచ్చి అమర్చే పనులు సాగుతున్నాయి. నాగోలు బ్రిడ్జి నుంచి మమతానగర్ మీదుగా నాగోలు చౌరస్తా మొదలుకుని ఆర్టీసీ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అనంతరం వాటర్, డ్రైనేజీ, వరద నీటి కాలువ పనులను పూర్తి చేసిన అధికారులు మమతానగర్ ప్రాంతంలో చిన్న పైపులైన్ లింక్ పనులను పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఈ లింగ్ పూర్తయిన వెంటనే ఇన్నర్ రింగ్రోడ్డు పక్కన సర్వీస్రోడ్డును కూడా నిర్మించేందుకు ప్రాజెక్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.