ఎల్బీనగర్, ఆగస్టు 2 : ఉప్పల్ నుంచి ఎల్బీనగర్కు ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు వేగం అందుకున్నాయి. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి నాగోలు మీదుగా ఎల్బీనగర్ వరకు ఉన్న ఇన్నర్ రింగ్రోడ్డులో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం కోసం నాగోలు చౌరస్తాలో ఎస్ఆర్డీసీ పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్లై ఓవర్ పక్కన సర్వీస్ రోడ్డు పనులతో పాటుగా ఫ్లై ఓవర్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇటు ఇన్నర్ రింగ్రోడ్డు ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు, అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఎలాంటి అడ్డంకులు లేకుండా తేలిగ్గా ప్రజల ప్రయాణం సాగించేందుకు ఇన్నర్ రింగ్రోడ్డులో నిర్మాణాలు సాగుతున్నాయి. అందులో భాగంగా నిర్మిస్తున్న నాగోలు ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోలులో సర్వీస్ రోడ్డు పనులు చేపడుతున్నామని, ఫ్లై ఓవర్ నిర్మాణం, స్లాబ్లను వేసేందుకు సిద్ధమవుతున్నాయని ఎస్ఆర్డీపీ విభాగం డీఈ కార్తిక్ తెలిపారు.