చిక్కడపల్లి, ఆగస్టు7: కొవిడ్-19 (కరోనా) నేపథ్యంలో పెరుగుతున్న మానసిక సమస్యలు, ఒత్తిళ్ల పరిష్కారంలో ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, కౌన్సెలింగ్ సైకోథెరపిస్టు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు. అశోక్నగర్లోని ప్రోగెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హిప్నో పద్మా కమలాకర్, ఫోరెన్సిక్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ గ్రంథి సరోజారాయ్లు ఇందులో మాట్లాడారు. ఒంటిరితనం చాలా మందిలో ఒత్తిడికి కారణమవుతుందన్నారు.
ఒత్తిడి స్థాయి మించితేనే అసలు సమస్య మొదలై ఆలోచనా స్థాయి, విశ్లేషణ శక్తి తక్కువై గొడవలు పెరిగిపోతాయన్నారు. కరోనా ఫోబియా అందరిలో పెరిగిపోయి భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ కోసం 93900 44031, 93900 44032లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో గ్రంధి హిమకర్లు పాల్గొన్నారు