కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తూ శుభకార్యాలు, వేడుకలకు ఆటంకంగా మారింది. దీంతో విందులు, వివాహ వేడుకలను తేదీలను ముందస్తుగా పెట్టుకున్నవారు సైతం ఇప్పుడు నిర్వహణకు వెనకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం కరోనా లేదు.. గిరోనా లేదంటూ నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వివాహ జంట ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వినూత్న ఆలోచన చేసింది. పెండ్లి తంతును డిజిటల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షించాలని కోరడమే గాక, కట్న కానుకలను సైతం డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని పేర్కొనడం విశేషం. ఈ మేరకు రూపొందించిన పెండ్లి కార్డ్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం నెటిజన్లను ఇది విశేషంగా ఆకట్టుకుంటున్నది.