హైదరాబాద్ : ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా ముస్తాబైంది. నాగోల్ పరిధిలో మూసీ నదిని రమణీయంగా తీర్చిదిద్దారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాకలను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగస్టు రోజున ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మూసీని అతి సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా.. అందులో బోటింగ్లో సదుపాయం కల్పించే దిశగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అది సీఎం కల అని పేర్కొన్నారు. ఒకప్పుడు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారు దోమల బెడదకు గురయ్యేవారు. దుర్వాసనతో అనారోగ్యం పాలయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సుధీర్ రెడ్డి తెలిపారు.