కార్వాన్, అక్టోబర్ 13: తాగిన మైకంలో భార్యను హతమార్చిన ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్లో చోటు చేసుకుంది. అదనపు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన హన్మల్కర్ శ్రీనివాస్, మంగళమ్మ(40)భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ పెయింటర్గా పనిచేస్తుండగా, మంగళమ్మ ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ తరచూ మద్యం సేవించి భార్యను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కొడుకు విష్ణు తల్లిదండ్రులకు సర్దిచెప్పి వ్యాపారం నిమిత్తం కూరగాయల మండికి వెళ్లాడు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నిద్రలేచిన శ్రీనివాస్ రోలుతో మంగళమ్మ తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కూతురు తల్లి మంగళమ్మను ఉస్మానియా దవాఖానకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.