గోల్నాక, మే 9 : పూటుగా మద్యం సేవించిన స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బి.మోహన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్అంబర్పేట తురాబ్నగర్ ముఖ్రం హోటల్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2.40 గంటలకు ఇద్దరు స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటూ మద్యం సేవించారు. పూటుగా మద్యం సేవించిన అనంతరం మత్తులో గొడవకు దిగారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరు బండరాయితో బాదడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన మరో వ్యక్తి మద్యం మత్తులో అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉండటంతో అతన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి వయసు సుమారు 35 ఏండ్ల వరకు ఉండగా స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకునేవారిగా పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు మృతుడిని గుర్తించకపోవడంతో మృతుడి వివరాలు కచ్చితంగా తెలియరాలేదు. కాగా దాడికి పాల్పడి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు విచారించగా.. తన పేరు శ్రీనివాస్, రాంనగర్లో నివాసముంటానని చెప్పాడు. తాను దాడి చేసిన తన స్నేహితుడి పేరు అంజి అని, ఇక్కడే ఫుత్పాట్పై నివాసముంటాడని అరకొర వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. అయితే మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధిత మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.