చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 25: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఐదుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. షేక్ ఇస్మాయిల్ (26), మహ్మద్ తాజుద్దీన్ (21), షేక్ ఉస్మాన్ (20), మహ్మద్ సాహిల్(20), మహ్మద్ రహేన్ (19) మహ్మద్ ఆసిఫ్ (20) చిల్లర దొంగతనాలు, ఇతరులపై దాడులు చేస్తూ.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. వీరిలో షేక్ ఇస్మాయిల్ పాతనేరస్తుడు. ఇతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో హత్య కేసులతో పాటు మారణాయుధాలు కలిగి ఉండటం మొత్తం 11 కేసులు ఉన్నాయి. ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఈ నెల 20న అందరూ కలిసి పార్థివాడ బస్తీలో ఓ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. మత్తులో షేక్ ఇస్మాయిల్ ఆసిఫ్తో గొడవకు దిగాడు. అందరూ ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆసిఫ్ను గట్టిగా పట్టుకోగా, ఇస్మాయిల్ కత్తితో రెండు సార్లు పొడిచాడు. ఆటోలో తిరుగుతూ బండ్లగూడలోని ఓ కళాశాల సమీపంలో నిర్మానూష్య ప్రాంతంలో ఆసిఫ్ను పడేశారు. ప్రాణం పోలేదని గమనించి.. మరోసారి కత్తితో పదిపోట్లు పొడిచి.. గొంతుకోసి చంపేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.