మెహిదీపట్నం, సెప్టెంబర్ 22: పాతకక్షలతో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..టోలీచౌకి నదీంకాలనీలో నివాసముండే సయ్యద్ జిలానీ(50) హకీంపేట్లోని ఓ దుకాణంలో పనిచేస్తుండేవాడు. గతంలో రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన సల్మాన్ అనే యువకుడి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు. మృతుడి సోదరుడు షేక్ ఇమ్రాన్.. జిలానీ జైలు నుంచి వచ్చిన తర్వాత అతడిని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్తున్న జిలానీని సెవన్ టూంబ్స్ వెళ్లే రోడ్డులోని మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద షేక్ ఇమ్రాన్ తన స్నేహితులు మహ్మద్ రహమాన్, ముఖ్తార్ అహ్మద్లతో కలిసి అడ్డుకుని గొంతుకోసి హత్య చేసి పారిపోయారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.