మెహిదీపట్నం మే 8: ఒంటరిగా వెళ్తున్న వారిని వెంబడిస్తాడు. అవకాశం చూసుకొని.. దాడి చేస్తాడు. అందిన కాడికి దోచుకుంటాడు. అలా సాఫ్ట్వేర్ ఇంజినీర్పై దాడి చేయగా, అతడు చికిత్స పొందుతూ మరణించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం…..మెహిదీపట్నం అంబేద్కర్నగర్లో ఉండే తాడిచెర్ల దాన రమేశ్ కుమార్(40) ఓ కంపెనీలో పనిచేసేవాడు. ఏప్రిల్ 21న రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లి.. రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. తనను మెహిదీపట్నం ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఎవరో కొట్టి.. ఉంగరాలు, డబ్బులు లాక్కుని పారిపోయారని చెప్పి..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ మే 1న మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన ఆసిఫ్నగర్ పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన షేక్ అహ్మద్(38)గా గుర్తించారు. శనివారం మెహిదీపట్నంలో అరెస్టు చేశారు. విచారణలో రమేశ్పై దాడి చేసి కొట్టి, దోచుకున్నట్లు నిందితుడు చెప్పడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.