సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): రౌడీ షీటర్ హత్య కేసులో మరో రౌడీ షీటర్ సోదరులు, వారి అనుచరులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్రెడ్డితో కలిసి సోమవారం సీపీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 17న తెల్లవారుజామున ఓల్డ్ మలక్పేట్లో సయ్యద్ ముస్తాకుద్దీన్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మృతుడిపై రౌడీషీట్ ఉండటంతో పాటు పలుమార్లు పీడీ యాక్టులో జైలుకు వెళ్లొచ్చాడు. ఓల్డ్ మలక్పేట్కు చెందిన రౌడీషీటైర్లెన మహ్మద్ బిన్ అల్వి అలియాస్ మహమ్మద్ జబ్రి, అయూబ్ బిన్ అల్విలు సోదరులు. కాగా, మృతుడు ముస్తాకుద్దీన్కు, మహ్మద్ బిన్ అల్విలు ఇద్దరు రౌడీషీటర్లు కావడంతో ఓల్డ్ మలక్పేట్ అబు బాకర్ మజీద్ ఏరియాలో అన్నింట్లో తానే ఉండాలని, తన పేరు చెబితే అందరు భయపడాలన్న ధోరణిలో.. ఇద్దరి మధ్య ఆధిపత్యం చెలాయించే విషయంలో మనస్పర్ధలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ముస్తాకుద్దీన్ ఓల్డ్ మలక్పేట నుంచి మకాం హుమాయీన్నగర్కు మార్చాడు. తరుచు ఓల్డ్ మలక్పేట్కు వచ్చిపోతున్నాడు. ఆ సమయంలో మహ్మద్ బిన్ అల్వి పేరు అక్కడ వినపడేది. దీంతో మద్యం మత్తులో అల్విని హతమారుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో అప్రమత్తమైన అల్వి, తన ప్రత్యర్థి అయిన ముస్తాఖుద్దీన్ను హతమార్చేందుకు తన సోదరుడు అయూబ్ బిన్, చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ హైదర్ అలీ ఖాద్రి, మహ్మద్ జుబేర్, వలీ అహ్మద్లతో స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా 17న ముస్తాకుద్దీన్ అబు బాకర్ మజీద్ వద్దనున్న ప్రధాన నిందితుడైన మహ్మద్ బిన్ అల్వి ఇంటికి సమీపంలోకి రావడంతో ఇద్దరు కలిసి మాట్లాడుకొని, మద్యం సేవించారు.
మద్యం మత్తులో ఉండగానే ముస్తాకుద్దీన్ను కత్తులతో పొడిచి పరారయ్యారు. చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఆ దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఈ హత్య జరిగిన తరువాత ఈ గ్యాంగ్లోని నలుగురు సభ్యులు కలిసి అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక సెల్ఫోన్ స్నాచింగ్కు ప్పాలడ్డారు. ఈ ఘటనలోని నిందితులను సోమవారం ఉదయం అరెస్ట్ చేసి విచారించడంతో స్నాచింగ్ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్ నేతృత్వంలో చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ బృందం దర్యాప్తు చేస్తుంది. హత్య కేసును వేగంగా చేధించిన సిబ్బందిని సీపీ అభినందించారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో జరిగే నేర ఘటనలు 99.99 శాతం కేసులను 24 గంటల్లో చేధిస్తున్నామని సీపీ తెలిపారు. హత్యలు, స్నాచింగ్ తదితర ఘటనలు జరుగగానే వెంటనే దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి వేగంగా నిందితులను పట్టుకుంటున్నాయని వివరించారు. సిటీలో రౌడీయిజాన్ని క్షమించబోమన్నారు. ఈ ఏడాది 21 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్టులు ప్రయోగించామని, మరో 31 మందిపై త్వరలో పీడీ ప్రయోగించనున్నారు. సాధారణ ప్రజల మాదిరిగా జీవనం సాగించాలని, రౌడీయిజం చేస్తే అలాంటి వారిపై నమోదయ్యే కేసులలో బెయిల్ రాకుండా అడ్డుకుంటామన్నారు. రౌడీయిజం చేసే వారిపై ఫోన్ నంబర్ 94906 16555కు వాట్సాప్ చేయాలని సీపీ ప్రజలకు సూచించారు.