నేరేడ్మెట్, మే 17 : మద్యం మత్తులో తిడుతుండడాన్ని తట్టుకోలేక.. స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతనగర్ కాలనీలో ఈస్ట్ కృపా అపార్టుమెంట్లో శ్యాంసుందర్ (31) నివాసముంటూ.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దాని పక్కనే నివాసముండే పులగం నవీన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరు ఇద్దరు స్నేహితులు. తరచూ మద్యం తాగుతుంటారు. మద్యం మత్తులో శ్యాంసుందర్.. నవీన్ను, అతడి కుటుంబ సభ్యులను తిడుతుండేవాడు. దీంతో నవీన్.. స్నేహితుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరు నవీన్ ఇంట్లో మద్యం తాగారు..
ఈ క్రమంలో శ్యాంసుందర్ మళ్లీ నవీన్ను తిట్టి.. ఇంటికి వెళ్లిపోయాడు.. కోపంతో ఉన్న నవీన్.. శ్యాంసుందర్ ఇంటికి వెళ్లి అతడిని ప్రశ్నించాడు.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నవీన్ కర్రతో శ్యాంసుందర్పై దాడి చేయగా అతను కిందపడ్డాడు. సిమెంట్ ఇటుకతో శ్యాంసుందర్ తలపై గట్టిగా కొట్టి వెళ్లిపోయాడు. అతడి తల్లి రేణుక గట్టిగా కేకలు వేయగా.. ఎవరూ రాలేదు. దీంతో 108కు సమాచారం ఇచ్చింది.. సిబ్బంది వచ్చి పరిశీలించగా శ్యాంసుందర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శివకుమార్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు