న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని, దుబాయ్, ఒమన్లో జరుపాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించినట్టు సమాచారం. బీసీసీఐ కూడా అంతర్గతంగా ఇందుకు సముఖత వ్యక్తం చేసిందని ఐసీసీకి చెందిన ఓ అధికారి చెప్పారు. దీంతో యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్తో పాటు ఒమన్లోని మస్కట్ వేదికలుగా అక్టోబర్ చివరి వారం నుంచి టీ20 మెగాటోర్నీ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని బీసీసీఐ అడిగింది. అయితే ఆతిథ్యహక్కులు తమకే ఇచ్చి యూఏఈ, ఒమన్ వేదికగా మెగాటోర్నీ నిర్వహించినా అభ్యంతరం లేదని ఐసీసీకి తెలిపింది. ఏర్పాట్లు కూడా మొదలుపెట్టవచ్చని చెప్పింది. భారత్లో ప్రస్తుతం రోజుకు దాదాపు 1.20లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్లో మూడోవేవ్ వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటప్పుడు అక్టోబర్లో టోర్నీ నిర్వహించగలమని ఇప్పుడు కచ్చితంగా చెప్పడం కష్టం. ఒకవేళ పరిస్థితులు బాగాలేకుంటే కొన్ని దేశాల ప్లేయర్లు భారత్కు వచ్చేందుకు ఇష్టపడకపోవచ్చు. యూఏఈ అయితే అందరూ సంతోషంగా ఉంటారు అని ఐసీసీకి చెందిన ఓ అధికారి చెప్పారు.