కందుకూరు, మే 5 : సొంత బావను రోకలిబండతో కొట్టి హతమార్చిన సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మురళీనగర్ గ్రామానికి చెందిన బలరామ్(38)కు గోరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గోరి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో జయలక్ష్మిని రెండవ వివాహం చేసుకోగా కుమారుడు జన్మించాడు. వీరి కాపురం సజావుగా సాగుతున్నది. అయితే ఈ నెల 2న బలరామ్ మద్యం సేవించి వచ్చి జయలక్ష్మిని చితకబాది పిల్లలతో సహా ఇంట్లోనుంచి వెల్లగొట్టాడు. దీంతో చేసేది లేక పిల్లలతో కలిసి జయలక్ష్మి గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం వద్ద సాయంత్రం వరకు తలదాచుకుంది.
సాయంత్రం తన తోటి కోడలు ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నది. ఇదిలా ఉండగా ఈ నెల 4న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జయలక్ష్మి తల్లి లక్ష్మి, తండ్రి దిప్లా, అన్న రమేశ్, తమ్ముడు మోహన్లు బలరామ్తో మాట్లాడటానికి ఇంటికి వచ్చారు. బలరామ్ వారిని బూతులు తిడుతూ కొట్టడానికి వెళ్లడంతో కోపోద్రిక్తుడైన మోహన్ పక్కనే ఉన్న రోకలి బండతో బలరామ్ తలపై బాధాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బలరామ్ను 108 సహాయంతో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.