సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది అంటే ఇదేనేమో.. ఓ మల్టీలెవల్ మార్కెటింగ్కు సంబంధించి..
బంగ్లాలో దాచిన డబ్బులను కాజేసిన తండ్రీకొడుకులు.. విలాసాలు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే…అతి తక్కువ కాలంలోనే శ్రీమంతులైన తన బంధువు కుటుంబం వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి ఏదో విషయం ఉందంటూ అనుమానించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు..తమదైన శైలిలో కూపీ లాగారు. తీగ లాగితే డొంక కదిలినట్లు భవనంలో క్యాష్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రమేయం ఉన్న వారందరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కొందరు ప్రజాప్రతినిధులకు కూడా కొట్టేసిన నగదు చేరినట్లు తేలడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుతో లింక్ ఉన్న వారు ఎవరైనా సరే.. వదిలి పెట్టబోమని హెచ్చరిస్తున్నారు. మోసపోయిన బాధితులకు సొమ్ము చేరేలా కృషి చేస్తామంటున్నారు.
2018 డిసెంబర్లో సైబరాబాద్ పోలీసులు ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాన్ని బయటపెట్టారు. సన్పరివార్ పేరుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ అధిక వడ్డీలు ఇస్తానని.. సుమారు 1400 మంది నుంచి రూ. 158 కోట్లను వసూలు చేసి మోసం చేశాడు. ఈ కేసులో పోలీసులు సన్పరివార్ సీఈవోగా ఉన్న రవీందర్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఈ సంస్థకు చెందిన పలు ఆస్తులు, కొంత నగదు, బ్యాంక్ల్లో ఉన్న లక్షలాది రూపాయలను సీజ్ చేశారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టించిన ఓ వ్యక్తి ఒక సందర్భంలో సన్పరివార్కు చెందిన సుమారు రూ. 14 కోట్లు రాంచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఓ ఫ్లాట్లో ఉన్నాయని చర్చించాడు.
అయితే సీఈవో జైలు నుంచి వచ్చిన తర్వాత మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీంలో చేరిన వారందరికీ డబ్బులను తిరిగి ఇచ్చేస్తాడు..ఎవరూ ఆందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చాడు. ఈ సంభాషణలో పాల్గొన్న ఖైరతాబాద్కు చెందిన నరేశ్కు ఆ డబ్బుపై కన్ను పడింది. అదే సంవత్సరం డిసెంబర్లో తన కుమారుడు అభిజిత్తో కలిసి స్కెచ్ వేశాడు. డబ్బు ఉన్న భవనం వద్ద రెండు సార్లు రెక్కీ చేశాడు. అయితే అప్పటికే ఆ ఫ్లాట్ను పోలీసులు సీజ్ చేయడంతో పక్కనే ఓ ఇల్లు తీసుకొని.. తండ్రీకొడుకు అందులోకి దిగారు. డబ్బు ఉన్న ఫ్లాట్ తాళాన్ని పగులగొట్టి సొమ్ము తస్కరించారు. ఆ తర్వాత నగదును కారులో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో అభిజిత్ స్నేహితుడు కూడా సహకరించాడు.
అలా తీసుకున్న 14 కోట్లను దాచిన నరేశ్.. ఎనిమిది నెలల పాటు సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్తులు, ఇండ్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఖరీదైన కార్లు, కేజీల కొద్దీ బంగారాన్ని కూడా కొన్నాడు. ఇలా ఆర్భాటాలు పెరిగిపోవడంతో అతడి బంధవుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు నరేశ్ వ్యవహారశైలిపై ఆరా తీసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కూపీ లాగిన పోలీసులు.. నరేశ్, అభిజిత్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అలాగే నరేశ్ భార్య అనురాధ, కూతురు నితిషా, కుమారుడు అభిజిత్లను రాంచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
చోరీ చేసిన డబ్బులతో కూడబెట్టిన ఆస్తుల చిట్టాను వెలికి తీస్తున్నారు. వాటన్నింటిని సీజ్ చేసి కోర్టుకు అప్పజెప్పనున్నారు. కాగా, నితిషా శివారు ప్రాంతంలోని ఓ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నరేశ్ నగదును కొందరు ప్రజా ప్రతినిధులకు కూడా ఇచ్చినట్లు విచారణలో తెలిపినట్లు తెలిసింది. దీంతో ఆ డబ్బుతో ప్రజాప్రతినిధులు చేసిన రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలపై పోలీసులు నజర్ పెట్టారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.