చార్మినార్, ఆగస్ట్ 20: త్యాగానికి ప్రతిరూపమైన మొహర్రం సంతాప దినాల్లో భాగంగా మొహర్రం మాసం పదో రోజున షియా సోదరులు శుక్రవారం పెద్ద ఎత్తున మాతం నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి షియా వర్గీయులు డబీర్పురలోని బీబీకా అల వా వరకు చేరుకున్నారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా షియా వర్గీయుల భవితవ్యం కోసం ప్రాణాలను విడిచిన తమ పూర్వికుల సంస్మరణార్థం మాతం (రక్తాన్ని) చిందించారు. శుక్రవారం మధ్యా హ్నం డబీర్పురలోని బీబీకా అలవా నుంచి అలంలను అంబారీపై ప్రతిష్టించి ఊరేగించారు. ఊరేగింపులో భాగంగా దారుల్షిఫా వద్ద ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, చార్మినార్ పోలీస్ స్టేషన్ వద్ద నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు సీపీ షికాగోయల్, డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ అనిల్ కుమార్, అవినాష్ మహంతిలతో కలిసి అలంలకు దట్టీలు సమర్పించారు. డబీర్పుర బీబీకా అలంతో పాటు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన అలంలను ఒంటెలతో పాటు ఇతర జంతువులపై ప్రతిష్టించి పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఊరేగింపును నిర్వహించారు. ఊరేగింపునకు దాదాపు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.