గ్రేటర్లో దోమలపై జీహెచ్ఎంసీ దండయాత్ర ముమ్మరం చేసింది. ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల అంతానికి పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నది. అచ్చం మనిషి ఉన్నట్టుగానే భ్రమించేలా దోమలకు అనుభూతి కల్పిస్తూ వాటి వేట కొనసాగిస్తున్నది. నూతన టెక్నాలజీతో రూపొందించిన ‘మస్కిటో కిల్లింగ్ యంత్రం’తో 500 మీటర్ల దూరంలో ఉన్న దోమలను ఇట్టే ఆకర్షిస్తూ మట్టుబెడుతున్నారు. గ్రేటర్లోని ఆరు జోన్ల పరిధిలోని ఏడు చోట్ల ఈ మిషన్లను ఏర్పాటు చేయగా అనూహ్య ఫలితాలు వచ్చాయి. దీంతో నెలాఖరులోగా మరో మూడు యంత్రాలను తీసుకొచ్చి సికింద్రాబాద్లో రెండు చోట్ల, ఖైరతాబాద్లో మరొక చోట ఏర్పాటు చేయనున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. – సిటీబ్యూరో, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ)
సాధారణంగా దోమలు మనుషుల శ్వాస, శరీర వేడి, వాసనలను పసిగట్టి కుడుతాయి. ఇదే సిద్ధాంతంతో ఐవోటీ మిషన్ పనిచేస్తుంది. యంత్రం నుంచి తొలుత కార్బన్ డయాక్సైడ్ విడుదలై, అనంతరం 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉద్భవిస్తుంది. మనిషి శరీర వాసన కలిగించేలా మిషన్లలో టెక్నాలజీని వినియోగించి 500 మీటర్ల దూరంలో ఉండగానే దోమలను ఆకర్శిస్తుంది. వలలో చిక్కిన దోమలు లోపల ఫ్యాన్ తిరుగగానే ఎయిర్ బ్యాగ్లోకి వెళ్లి చనిపోతాయి.
నగరంలో రోజురోజుకు పెరిగిపోతూ.. భయానక రోగాలకు కారణమవుతున్న దోమలను అంతమొందించేందుకు జీహెచ్ఎంసీ టెక్నాలజీకి పనిచెప్పింది.
చికున్ గున్యూ, మలేరియా, డెంగీ, ఎబోలా తదితర ప్రాణాంతక వ్యాధులతో మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న దోమలను వ్యూహాత్మకంగా అంతం చేయాలని నిర్ణయించిన అధికారులు గత ఏడాది పైలెట్ ప్రాజెక్టులో ‘మస్కిటో కిల్లింగ్’ మిషన్లను (ఐఓటీ) అందుబాటులోకి తీసుకువచ్చారు. 500 మీటర్ల దూరంలో ఉన్న దోమను ఇట్టే ఆకర్షిస్తూ మట్టుబెట్టే ఈ ఆధునిక యంత్రాన్ని ఆరు జోన్ల పరిధిలోని ఏడు చోట్ల ఏర్పాటు చేయగా అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఈ నెలాఖరులోగా సికింద్రాబాద్లో రెండు చోట్ల, ఖైరతాబాద్లో ఒక చోట ఏర్పాటు చేయనున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు.
మస్కిటో కిల్లింగ్ యంత్రంతో పాటుగా మస్కిటో ట్రాప్ మిషిన్లో సీఓ2 సిలిండర్, అడాప్టర్, ఇన్ట్యూటివ్ కంట్రోల్ ప్యానెల్, మొబైల్ స్టాండ్, పవర్ కార్డు, ఫ్యాన్-ఇటలీ, ఈఎల్సీఓ, క్యాచర్, యూనివర్సల్ బ్రాకెట్, ఏరోబ్యాగ్, హోల్డర్, అట్రాక్టెంట్ స్టాండర్డ్ ప్రీమియం, గ్యాస్ కంట్రోల్ టెక్నాలజీ తదితర పరికరాలతో ఈ మిషన్ను తయారు చేశారు. ఇప్పటికే సత్ఫలితాలిస్తున్న దోమలను చంపే యంత్రాలు కార్బన్ డయాక్సైడ్తో కూడిన సిలిండర్ను రెండు నుంచి మూడు నెలలకోసారి మారుస్తారు.
మస్కిటో కిల్లింగ్ మిషన్ 12 గంటల పాటు పనిచేస్తుంది. విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఇప్పటికే హైకోర్టులో రెండు మిషన్లు ఏర్పాటు చేయగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో హైదర్శకోట్, చైతన్యపురి, పురాణాపూల్లో ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ తరఫున ఏడు చోట్ల వినియోగంలో ఉన్నాయి. మిషన్ల పనితీరును జీహెచ్ఎంసీ ఎంటమాలజి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎల్బీనగర్ పెద్ద చెరువు, హెచ్ఎంటీ నగర్ పార్కు, నాచారం
చార్మినార్ మలక్పేట వాహేద్నగర్
ఖైరతాబాద్ లంగర్హౌస్ హుడా పార్కు , జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం
శేరిలింగంపల్లి యూసుఫ్గూడ కృష్ణకాంత్పార్కు
కూకట్పల్లి కేపీహెచ్బీ ఏడవ ఫేజ్, మైసమ్మ చెరువు
సికింద్రాబాద్ బేగంపేట, ్రబ్రాహ్మణవాడి ట్రస్ట్