సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మలేరియా, డెంగీ, చికున్గున్యా వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జీహెచ్ఎంసీ ప్రజల్ని కోరింది. దోమల ఆవాసాలను గుర్తించి నశింపజేందుకు ప్రతి ఆదివారం కేవలం పది నిమిషాల పాటు సమయాన్ని కేటాయించాలని సూచించింది. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు పది వారాల కార్యాచరణ ప్రణాళికను ఆదివారం నుంచి అమలు చేయాలని తెలిపింది. నగరంలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పది వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఎవరి ఇంట్లో వాళ్లు దోమల పెరుగుదలకు ఉపయోగపడే వస్తువులను తొలగించాలి.
ఇంట్లోనే కాకుండా పరిసరాలు, కార్యాలయాలు, పరిశ్రమలు, మూతలులేని ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, సిమెంటు మట్టి తొట్టెలు, కుండీలు, కూలర్లు, పాత టైర్లు, పూలకుండీల కింద ప్లేట్లు, తాగిపడేసిన కొబ్బరిబొండాలు, ఇతర పనికిరాని పగిలిపోయిన వస్తువుల్లోని నీటి నిల్వలను తొలగించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై… దోమల రహిత నగరం కోసం పోరాడుదామని బల్దియా పిలుపునిస్తున్నది.