సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ ) : దోమల వ్యాప్తి నివారణ ప్రతి పౌరుని బాధ్యత అని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. దోమల రహిత నగరం కోసం కలిసి పోరాడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం 30 సర్కిళ్లలో దోమల నివారణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
150 డివిజన్లలో 150 కాలనీలలో సుమారు 45 వేల మంది ప్రజల సమక్షంలో స్టాల్స్ ఏర్పాటు చేసి దోమ గుడ్డు, లార్వా దశ నుంచి పెద్ద దోమ గా ఎలా మారుతుందో సెల్ఫోన్ వీడియోల ద్వారా, ఫ్లిప్ బుక్ ల ద్వారా ప్రత్యక్షంగా అవగాహన కల్పించినట్లు రాంబాబు చెప్పారు. 30 సరిళ్ల పరిధిలో ప్రతి ఒక ఎంటమాలజీ కార్మికుడు ఇంటింటికి తిరిగి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని ఒలకబోసి ఇంటి సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ అవగాహన, ఆరోగ్య సదస్సులకు పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను, మేయర్, డిప్యూటీ మేయర్లను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్ లను, ప్రజా ప్రతినిధులను, విఐపిలను, జిహెచ్ఎంసి అధికారులను, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులను, పొదుపు సంఘాల మహిళా సభ్యులను భాగస్వామ్యం చేశామని వివరించారు.
కార్యక్రమాలలో ఆరు జోన్ల సీనియర్ ఎంటమాలజీస్ట్ లు, 30 సరిళ్ల అసిస్టెంట్ ఎంటమాలజీస్ట్ లు, 150 డివిజన్ల సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.