సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు మొబైల్ టాయిలెట్లు పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించి వీటిలో ప్రత్యేకంగా స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారిగా ట్రాన్స్జెండర్స్కు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ఇప్పటికే 30 మొబైల్ టాయిలెట్లు నగరవాసులకు అందుబాటులో ఉండగా ఖైరతాబాద్ జోన్కు ఇటీవల కేటాయించిన మరో ఐదు మొబైల్ టాయిలెట్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి మంగళవారం ఖైరతాబాద్లో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, సభలు సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ మొబైల్ టాయిలెట్లను ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు. ఈ మొబైల్ టాయిలెట్లలో స్త్రీలకు రెండు, పురుషులకు ఒకటి, నాలుగు యూరినల్స్లతో పాటు పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ బస్సు వెనుకభాగంలో స్నాక్స్, కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికిగాను చిన్న షాపు ఏర్పాటుకు సౌకర్యం కల్పించామని చెప్పారు. సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.