బంజారాహిల్స్, అక్టోబర్ 25: క్యాన్సర్ గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో గుర్తించి చికిత్సను అందిస్తే వ్యాధి నుంచి బయటపడవచ్చని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత అన్నారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోమవారం ‘క్యాన్సర్పై అవగాహన-స్క్రీనింగ్ క్యాంప్’ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయలత మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించగలిగితే 95 శాతం మందిలో పూర్తిస్థాయిలో చికిత్సను అందించవచ్చన్నారు. అనంతరం యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, పలు విభాగాల డైరెక్టర్లు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, డాక్టర్ బానోత్లాల్, ప్రొఫెసర్ మధుసూధన్రెడ్డి, డాక్టర్ ఏవీఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.