సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ తొలగింపు తర్వాత ప్రజా రవాణా క్రమంగా మెరుగుపడుతోంది. అందులో భాగంగా, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సులు అన్ని రోడ్లపై తిరుగుతున్నాయి. మెట్రో సర్వీసులు కూడా ప్రతి రోజూ పూర్తి స్థాయిలో తిరుగుతున్నాయి. ఈ సందర్భంగానే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులు నగర ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, సిటీ బస్సులు, మెట్రో రైలు సర్వీసులతో పోల్చితే లోకల్ రైల్ సర్వీసులను ప్రస్తుతం 55 సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఆక్యుపెన్సీ 45 నుంచి 50 శాతానికి పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆక్యుపెన్సీ శాతం కనీసం 70 శాతానికి రావాల్సి ఉందన్నారు. మిగిలిన 66 లోకల్ రైలు సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లోకల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
త్వరలోనే ఎంఎంటీఎస్ లోకల్ రైలులో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, అతి తక్కువ ఛార్జీతోనే ప్రయాణికులు తమ గమ్య స్థానం చేరుకునే విధంగా లోకల్ రైలు అందుబాటులో ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే, లోకల్ రైళ్లు కేవలం ప్రయాణికుల సౌకర్యం కోసమే అందుబాటులోకి తీసుకువచ్చామే తప్ప లాభాపేక్ష కోసం కాదని, అందువల్ల అన్ని లోకల్ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే అధికారులు అన్నారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం తగ్గించడం, పలు విద్యా సంస్థలు తెరిచే ప్రయత్నం చేస్తే లోకల్ రైలు సర్వీసులలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు.