సిటీలో మళ్లీ లోకల్ రైళ్ల కూత మొదలైంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఎంఎంటీఎస్ 15 నెలల తర్వాత బుధవారం నుంచి పట్టాలెక్కింది. ఫలక్నుమా నుంచి ఉదయం 7.50గంటలకు తొలి సర్వీసు మొదలవ్వగా, రెండోది లింగంపల్లి నుంచి 8.43కి ప్రారంభమైంది. ప్రస్తుతం పది ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలక్నుమా-లింగంపల్లి మధ్య ఆరు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 4 రైళ్లు నడిపిస్తున్నారు. మరోవైపు పాత సీజన్ టికెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని రైల్వే అధికారులు ప్రకటించగా, సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్ పరుగులు పెట్టడంతో నగర ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇన్నాళ్లు బోసిపోయిన స్టేషన్లు సందడిగా కనిపించాయి. అన్ని వర్గాల వారు రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. రద్దీని బట్టి మిగిలిన సర్వీసులనూ దశల వారీగా ప్రారంభిస్తామని ఎస్సీఆర్ వెల్లడించింది.