బేగంపేట్ ఏప్రిల్ 19: ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఇంటర్ విద్యా సంయుక్త కార్యచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు సోమవారం ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి వాణీదేవిని సన్మానించారు. ఈ సందర్భంగా మధుసూదర్రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో పీవీ హయాంలో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయని ఈ క్రమంలో పీవీ శత జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇటువంటి తరుణంలో పీవీ తనయ ఎమ్మెల్సీగా గెలుపొందడం హర్షనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. తన విజయానికి తమ వంతు సహకరించిన ఇంటర్ విద్యా జేఏసీ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యను రాష్ట్రంలో ప్రారంభించి దేశంలో విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా మానవ వనరుల శాఖను ఏర్పాటు చేయడంలో పీపీ దూరదృష్టి దిశా నిర్ధేశాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థను బలోపితం చేయడం కోసం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోలార్ పవర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ శేఖర్ మారం రాజు, జేఏసీ ప్రతినిధులు విజయ్శేఖర్, కళింగ కృష్ణంరాజు, రాణి, రజిత, కవిత, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.