సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో 67.26శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో 60.77, మేడ్చల్-మల్కాజిగిరిలో 62.71, రంగారెడ్డి జిల్లాలో 65.25 శాతం మేర పోలింగ్ జరిగింది. గతంలో కంటే చాలా మెరుగ్గా పోలింగ్ జరగడం, వరుస సెలవుల ప్రభావం ఏ మాత్రం పడకుండా పట్టభద్రులు ముందుకొచ్చి ఓట్లు వేశారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు దూరమైన లెక్క చేయలేదు. ఓటు వేసేందుకు వయస్సు, వైకల్యం అడ్డురాదని నిరూపించారు. మొత్తంగా విద్యావంతులు చైతన్యస్ఫూర్తి కాగా.. అన్ని జిల్లాలలోనూ పురుషులకు ధీటుగా మహిళలు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చడం గమనార్హం. 2015 సంవత్సరంలో 37.72 శాతం నమోదు కాగా ఈ సారి 60.77 శాతం మేర నమోదు కావడం విశేషం. మొత్తంగా భారీగా పెరిగిన ఓటింగ్తో తమ కంటే తమకు అనుకూలమని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం (రేపు) సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో పరిశీలించారు. కౌంటింగ్తో పాటు బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం మొత్తం 1200 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మూడంచెల భద్రతను కల్పించామన్నారు. సీసీ కెమెరాల ద్వారా 24/7 నిఘాను పెట్టామని, ఈ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించినట్లు సీపీ తెలిపారు.