రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ అనేది చర్చనీయాంశంగా మారడం సాధారణం. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడం ఒకవంతైతే.. ముఖ్యంగా విద్యావంతులు పోలింగ్ రోజు గడప దాటి బయటకు రాకపోవడమనేది ప్రతిసారి జరుగుతున్నదే. ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలోనూ ఇదే తంతు కొనసాగుతుండటంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఇందుకు 2015లో జరిగిన హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ నిదర్శనం. ఆ ఎన్నిక సమయంలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2,96,317 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేయించుకున్నారు. ఇందులో ఏకంగా 45శాతం ఓట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో భాగంగా జరిగిన పోలింగ్లో మూడు జిల్లాల పరిధిలో కేవలం 37.72 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అంటే 1,11,766 మంది పట్టభద్రులు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలవారీగా చూసినా హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మిగిలిన వారు పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక.. అత్యధిక ఓట్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ కేవలం 34శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పూర్తి గ్రామీణ ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లాలోనే 55శాతం పోలింగ్ నమోదు కావడం కొంత ఊరట కలిగించే అంశం.
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న పోలింగ్ జరునున్నది. అయితే వరుసగా నాలుగు రోజులు సెలువులు రావడంతో ఓటర్లు హాలిడే మూడ్లో ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పోలింగ్ను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఓటర్లు అందరూ పట్టభద్రులు అయినందున ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని హితవు పలుకుతున్నారు. కాగా ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు కూడా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుపుతూ చైతన్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నా… ఓటరు జాబితాలోని ప్రతి ఒక్క పట్టభద్రుడు విధిగా ఓటు వేయాలనే స్పృహతో ముందుకొచ్చి చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరముంది.
2015లో కంటే ఏకంగా 181శాతం పట్టభద్రుల ఓట్లు పెరిగాయి. మూడు ఉమ్మడి జిల్లాలు ప్రస్తుతం తొమ్మిది కొత్త జిల్లాలుగా రూపాంతరం చెందగా.. పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 5,17,883కు చేరుకుంది. జాబితాలో 3,27,727 మంది పురుషులు ఉండగా.. 1,90,088 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 68మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే… ఉమ్మడి రంగారెడ్డిలో 2015జాబితాలో 1,33,003 మంది ఓటర్లు ఉండగా… ఈసారి ఆ సంఖ్య 2,94,055కు పెరిగింది. కొత్త జిల్లాలవారీగా చూసినా రంగారెడ్డిలోనే 2015లో మాదిరిగా మిగిలిన జిల్లాల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పట్టభద్రులు ఎక్కువగా ఓటును నమోదు చేసుకున్నారు. దీంతో ఈసారి కూడా రంగారెడ్డి జిల్లా అనేది కీలకంగా మారనున్నది.
ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఆయుధం ఓటు. బ్యాలెట్ పోరు వచ్చిన ప్రతిసారీ వినిపించే మాట ఇది. నిజంగా సామాన్యుడు ఈ ఆయుధాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నాడు? విద్యావంతులు మాత్రమే ఓటర్లుగా ఉండే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ సమయంలోనూ అందరిలో ఇదే ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా జరుగనున్న హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై గతంలో జరిగిన ఎన్నికల పోలింగ్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లందరూ పట్టభద్రులే అయినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం కేవలం 37.72శాతమే నమోదైంది. అయితే ఈసారి 181శాతం మేర ఓట్లు పెరిగాయి. పైగా పోలింగ్ జరుగనున్న ఈ నెల 14తేదీకి ముందు వరుస సెలవులు వస్తుండటంతో యువత మేల్కొని అధిక పోలింగ్ నమోదుతో ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదాలని పలువురు కోరుతున్నారు.