కంటోన్మెంట్, జూలై 17: పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా కూలీ నాలి చేసుకుని వచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం.. వారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నది. చిరకాల కోరికను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో నిర్మిస్తున్న 168 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న డబుల్ ఇండ్లను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డబుల్ ఇండ్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సాయన్న ముచ్చటించారు.
గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం త్వరలో లబ్ధిదారులకు చేరువవుతోంది. రసూల్పురాలో పలు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు కేటాయించారు. సుమారు 168 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ నెల 28వ తేదీన ప్రారంభించటానికి సిద్ధం చేస్తున్నారు. మరో 56 ఇండ్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసేందు కు అధికారులు సన్నద్ధమయ్యా రు. రెండు పడకల గదులు, హాల్, వంట గది, అటాచ్ బాత్ రూమ్లతో సుందరంగా ఉన్నాయి. అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నారు. రంగులతో సహా అన్ని పనులు పూర్తయ్యాయి. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
సిల్వర్ కంపౌండ్ ప్రాంతంలోని పేదలను ఖాళీ చేయించి ప్రభుత్వం ఎంతో పెద్ద మనస్సుతో సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుంబిగించింది. దీంతో స్థానిక బస్తీ వాసులను అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించింది. డబుల్బెడ్రూం ఇండ్లను అర్హుల జాబితా ప్రకారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.