కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా బస్తీల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సాయన్న మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మెల్యే కోటా కింద విడుదల కానున్న నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బాటలు వేయనున్నట్లు చెప్పారు. గతంలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బస్తీల్లో పర్యటించిన సమయంలో స్థానికులు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటికి పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
బొల్లారం, తిరుమలగిరి, మారేడ్పల్లి, రసూల్పురా, బోయిన్పల్లిలోని పలు కాలనీల్లో సామాజిక భవనాల నిర్మాణాలకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపనలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రధానంగా ఉన్న నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు ఇటీవలే బోర్డు సీఈఓతో భేటీ అయినట్లు తెలిపారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఉచిత నీటి సరఫరాపై ఇక్కడి ప్రాంత ప్రజలు తమకు కూడా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని తమ దృష్టికి తీసుకొచ్చార న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఉచిత నీటి సరఫరా అమలయ్యే విధంగా చేస్తానని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే సాయ న్న అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడ బిడ్డలకు కొండంత అండ గా నిలుస్తున్నదన్నారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమి త్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి చేదోడుగా నిలిచామని, దీంతో పాటు ఇటీవల పార్టీ కార్యకర్త అనారోగ్యంతో చనిపోతే ఆ వ్యక్తికి పార్టీ సభ్యత్వం ఉండడంతో రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందజేశానన్నారు.
ఏ పార్టీలో కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోరని, టీఆర్ఎస్లో మాత్రం కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూస్తామని చెప్పారు. బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లోని ప్రతి బస్తీలోని పేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను వాళ్ల దరికే చేర్చడం జరుగుతుందన్నా రు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క బస్తీకి నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.