సికింద్రాబాద్, సెప్టెంబర్ 14: గ్రేటర్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించిన విషయం తెలిసిందే. నియోజక వర్గాల్లో డివిజన్, వార్డు, బస్తీ స్థాయిలో కమిటీల ఏర్పాటును ముమ్మరం చేసింది. అన్ని బస్తీల్లో పన్నెండు మందితో కూడిన కమిటీల ఏర్పాటుపై తుది కసరత్తు చేస్తుంది. డివిజన్, వార్డు స్థాయి కమిటీల్లో ఎవరిని తీసుకోవాలి అనే అంశంపై కసరత్తు ప్రారంభించారు.
గులాబీకి కార్యకర్తలే పునాది……అందుకోసం బస్తీ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం బలోపేతం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నూతన కార్యవర్గం నియామకం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.
మరోవైపు కంటోన్మెంట్లో కమిటీల ఏర్పాటు ఇంకా తొలి దశలోనే ఉండటంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇదిలా ఉండగా రెండు నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పలు డివిజన్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు కోసం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కార్యకర్తల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడు, నాలుగు వార్డుల్లో వార్డు పార్టీ అధ్యక్షులుగా పలువురు పోటీ పడుతుండటంతో ఎవరికి పట్టం కట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 20తో పార్టీ కమిటీల నియామకం పూర్తిచేసే దిశగా నేతలు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ వేగాన్ని పెంచగా, కంటోన్మెంట్కు చెందిన కమిటీలకు సంబంధించి మంగళవారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో పాటు ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సాయన్న తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఎనిమిది వార్డులు, ఓ డివిజన్తో పాటు 232 బూత్స్థాయి కమిటీల ఏర్పాటుకు సంబంధించి నేతలకు ఎమ్మెల్యే సాయన్న దిశానిర్దేశం చేశారు. మూడు నాలుగు రోజులు పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.