మణికొండ, జూలై 16 : కోకాపేట భూముల్లో స్థిరనివాసం గుడిసెలు వేసుకుని ఉంటున్న నార్సింగి మున్సిపాలిటీ కోకాపేట సబితానగర్ కాలనీ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. రెండు దశాబ్దాలుగా అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలు శుక్రవారం స్థానిక నాయకులు కోకాపేట మాజీ ఉపసర్పంచ్ హరిశంకర్, అరికె మల్లేశ్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాము తదితరులు ఎమ్మెల్యేను కలిసి తమ గోడును విన్నవించారు. భూముల వేలం పాటలు పూర్తి అయిన నేపథ్యంలో ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ఆదేశాలు రావడంతో తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. సబితానగర్వాసులకు నార్సింగిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు హరిశంకర్, మల్లేశ్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాము, సబితానగర్వాసులు తదితరులు పాల్గొన్నారు.