అల్వాల్ : ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో నియోజకవర్గాన్ని రూ.500కోట్లతో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని శివసాయి ఎన్క్లేవ్, శ్రీ సాయి నగర్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. శ్రీ సాయి నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం, మౌలాలి కమాన్ వద్ద రహదారి విస్తరణతో పాటు నాలాల ఆక్రమణలతో ప్రతి సంవత్సరం ఎదురవుతున్న ముంపు సమస్యలను ప్రజల సహకారంతో సామరస్యంగా పరిష్కరించానని అన్నారు. ఇందులో భాగంగా శ్రీ సాయి నగర్ కాలనీలో దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని భూగర్భ డ్రైనేజీ కాలువల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలను పరిష్కరించానన్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు శ్రీ సాయి నగర్ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరగా నెలరోజుల వ్యవధిలో తన సొంత నిధులతో కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి, నరసింహా రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, బోజిరెడ్డి, విష్ణు ప్రసాద్, రమేశ్, సంపత్ రావు, జీవకుమారి, రవి కిరణ్, ప్రసాద్, లలిత, వినోద్ కుమార్, పంకజ్ పాండే, నిశాల్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.