ముషీరాబాద్, అక్టోబర్ 26 : టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎంతో దూరం లేవని, ఇప్పటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు విజయం సాధించడమే లక్ష్యంగా పని చేస్తుండాలని కోరారు. బస్తీ పాదయాత్రల ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం తలపెట్టిన పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.
దళిత బంధును విజయవంతం చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు. వచ్చే నెల 15న వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన విజయభేరి బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం చర్చించడానికి బుధవారం ముషీరాబాద్ కశిష్ ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీకి చెందిన అన్ని కమిటీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ముషీరాబాద్, రాంనగర్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్ల అధ్యక్షులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ఆర్ మోజస్, రాకేష్, వల్లాల శ్యామ్ యాదవ్, వై.శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేతలు బి.మనోహర్సింగ్, వి.సుధాకర్గుప్త, సుబ్బారావు, మల్లికార్జున్రెడ్డి, సురేందర్, రవియాదవ్, బల్విందర్, ఆకుల అరుణ్, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం కవాడిగూడ డివిజన్లోని జ్యోతినగర్ కమ్యూనిటీ హాల్లో అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు 14 రకాల నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్సా లాంటి సంస్థలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. ప్రతి పేద కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్సా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ హజారే మాట్లాడుతూ కరోనా సమయంలో తమ సంస్థ 2 వేల మంది కుటుంబాలకు పలువురి దాతల ద్వారా నిత్యావసర వస్తువులు అందజేసిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరింత సహాయం అందించడానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అప్సా సంస్థ ప్రతినిధులు రమేశ్, శ్రావణి, అంగన్వాడీ టీచర్ నర్సమ్మ, శేఖర్, టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, రాజశేఖర్ గౌడ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.