ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 30: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ 1.4 కోట్ల వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గ చర్రితలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మవారి ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రాంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాల ఆనవాయితీని కొనసాగించడానికి ప్రత్యేక నిధులు కేటాయించారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అమ్మవారి ఆలయాలు అధిక సంఖ్య ఉన్న నేపథ్యంలో తమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ. కోటి నాలుగు లక్షలు కేటాయించిందని అన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయాల వద్ద వసతులు కల్పించడంతోపాటు విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గం ప్రజలు శాంతియుత వాతావరణంలో బోనాల ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గం ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, నాగులు, దేవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ : ఆషాఢ బోనాల సందర్భంగా శుక్రవారం ముషీరాబాద్లోని శ్రీ మహంకాళి దేవాలయంలో శాకాంబరీ అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పట్టు వస్ర్తాలు సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముఠా గోపాల్కు బ్యాండ్ మేళాలు, పోతరాజుల నృత్యాలతో ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ముషీరాబాద్ నియోజక వర్గం ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారికి పూజలు చేసినట్లు ఎమ్మె ల్యే తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోనాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, ఈఓ సాంబశివరావు, శివాలయం చైర్మన్ శ్రీధర్చారి, శ్రీలక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, భవానీశంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గోవింద్, మహంకాళిదేవాలయం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సంగిశెట్టి రాజు, నాయకులు సయ్యద్ భక్తియార్, మల్లేశ్యాదవ్, శివ ముదిరాజ్, ముకుందరెడ్డి, లింగాల శ్రీకాంత్గౌడ్, రాజు, సదానంద్, డి. రాజు, గోవింద్, నర్సింగ్, ప్రవీణ్ముదిరాజ్ పాల్గొన్నారు.