ముషీరాబాద్, జూలై 28: అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొత్త కార్డు దారులకు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలోని ఫౌరసరఫరాల శాఖ మూడు సర్కిళ్ల ఏఎస్ఓలతో కలిసి రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన అబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారని, వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందవద్దని త్వరలోనే మరిన్ని కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 3,791 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. డీఎస్ఓ రమేశ్, ఏఏఎస్ఓలు రమావత్ తూక్యా నాయక్, చామొండేశ్వరీ, బాలరాజు, రాంనగర్ కార్పొరేటర్లు రవిచారి, ఎన్.సుప్రియాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్, ఎర్రం శేఖర్, గోక నవీన్, మధు, గజ్జెల సంపూర్ణ, తులసి, శోభ తదితరులు పాల్గొన్నారు.