ముషీరాబాద్, జూలై 20 : అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ హెరిటేజ్ భవనం వద్ద నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను త్వరలో తొలగించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నాలాల ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి అడిక్మెట్ డివిజన్లో రాంనగర్ చర్చి, అచ్యుత్రెడ్డి మార్గ్, మణెమ్మ గల్లీ, ముషీరాబాద్ డివిజన్ ఆదర్శనగర్లో పర్యటించి డ్రైనేజీ సమస్యల తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మకాలనీ, నాగమయ్య కుంటల వద్ద తూములు, నాలాల విస్తరణ పనులు త్వరలో చేపడుతామని, ఇం దుకోసం రూ. 12కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు. అశోక్నగర్ బ్రిడ్జిని స్టీలు వంతెన నిర్మాణానికి అనుగుణంగా విస్తరిస్తామన్నారు. డ్రైనేజీ లీకేజీ సమ స్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. మణెమ్మ గల్లీ, రామాలయం వీధి, చర్చి గల్లీలో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. డ్రైనేజీ లీకేజీ సమస్య ఎక్కడ తలెత్తినా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జలమండలి డీజీ వహాబ్, మేనేజర్ రమణ, టీఆర్ఎస్ నాయకులు శ్యాంసుందర్, సుధాకర్గుప్తా, శ్రీనివాస్రెడ్డి, మాధవ్, శ్రీనివాస్, సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, ప్రేమ్కుమార్, గురుదీప్, ధర్మ పాల్గొన్నారు.
విద్యానగర్ అచ్చుత్రెడ్డి మార్గ్లో వర్షాలకు ప్రధాన రోడ్డు కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలనీలో పర్యటించి అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కుంగిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
మణెమ్మగల్లీలో పైపులైన్ ఏర్పాటు చేస్తాం..
రాంనగర్ చౌరస్తా సమీపంలోని మణెమ్మ గల్లీలో మురుగు నీటి పైపులైన్ ఏర్పాటు పనులను కొందరు అడ్డుకోవడం వల్ల తాము మురుగు నీటి లీకేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. స్థానికంగా కొందరు నిర్వహిస్తున్న పశువుల కొట్టంతో లీకేజీ మురుగు సమస్య తలెత్తుతుందని, గతంలో నిలిచిన పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే లీకేజీకి తావులేకుండా పైపులైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.